Monday, September 10, 2018

క్షంతవ్యో మందబుద్ధీనా

क्षन्तव्यो मन्दबुद्धीनामपराधो मनीषिणा
न हि सर्वत्र पाण्डित्यं सुलभं पुरुषे क्वचित्

క్షంతవ్యో మందబుద్ధీనామపరాధో మనీషిణా
న హి సర్వత్ర పాండిత్యం సులభం పురుషే క్వచిత్

మంద బుద్ధిగలవాని అపరాధాలు క్షమార్హాలు. అందరికీ పాండిత్యం, వాగ్ధాటి లాంటివి సంపాదించడం అన్నది అంత సులభం కాదు.

అటువంటి సంపదను పొందడానికి కొంత పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు లేదా భగవత్ ప్రసాదంగా భావించాలి. అందువలన పండితులకు అకారణ గర్వం పనికిరాదు, పాండిత్యం లేని వారిని చిన్నచూపు చూడకూడదు. అవివేకి ఒక జ్ఞాని యొక్క సమాధానం నుండి నేర్చుకొనే దాని కన్నా ఎన్నో రెట్లు, ఒక తెలివైన వాడు, అజ్ఞాని యొక్క మూర్ఖపు ప్రశ్నల నుంచి ఎంతో నేర్చుకోగలడు.

Thursday, April 19, 2018

Monday, July 18, 2016

గురుపూర్ణిమ

🙏🏼గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ(మంగళవారం, 19.07.2016)

భారత దేశములో ఆషాడ పూర్ణిమనుండి నాలుగు మాసాలు చాతుర్మాసం పాటిస్తారు . పూర్వకాలములో శిష్యులు , గురువులు కూడా ఈ నాలుగుమాసములు వర్షాకాలము అయినందున , వ్యాధులు ప్రబలే కాలము అయినందున ... ఎలాంటి పర్యటనలు , దేశ సంచారము చేయకుండా ఒకేచోటే తాత్కాలికము గా నివాసము ఏర్పరచుకునేవారు . అప్పుడు శి్ష్యులు గురుగు దగ్గర వి్జ్ఞాన సముపార్జన చేసేవారు . ఈ జ్ఞానసముపార్జన లో మొదటిరోజు ని గురువుని ఆరాధించడానికి ప్రత్యేకించేవారు . ఈ సంప్రదాయమే కాలక్రమేన " గురుపూర్ణిమ " గా మారినది అని చరిత్ర చెబుతోంది .
ఆదిగురువు వేదవ్యాసులవారు . వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు . గురువులను , ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.

నేను రచిస్తున్న ఈ మహేతిహాసంలోని విషయమే ప్రపంచంలో ఉన్నది. ఇందులో లేనిది మరెక్కడా కొంచెమైనా లేదు'- ఈ మాటలు అనాలంటే ఆ కవికి ఎంతటి ఆత్మప్రత్యయం ఉండాలి? ఆ ఇతిహాసం ఎంత గొప్పదై ఉండాలి? ఆ విధంగా అని 'నిజమే!' అని నిరూపించుకొన్న కవివృషభుడు వేదవ్యాసుడు. ఆ ఇతిహాసం మహాభారతం. శ్రీమన్నారాయణుని 21 అవతారాల్లో పదిహేడో అవతారం వ్యాసుడని భాగవతం తెలియజెబుతోంది.

ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.

దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.

వసిష్ఠమహామునికి మునిమనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరమునికి పుత్రుడు, శుకమర్షికి జనకుడైనట్టియు, నిర్మలుడైనట్టి, తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, అంటారు
నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు.

వ్యాసుని తల్లిదండ్రులు సత్యవతి,పరాశరుడు. వేదాలను నాలుగుభాగాలుగా విభజించి పైలుడనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని, సుమంతుడనే శిష్యుడికి అధర్వణవేదాన్ని తెలిపి వ్యాప్తిచేయమని ఆదేశించాడు.

గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి.
ఈ రోజునే చాతుర్మాస్యవ్రతాన్ని ఆరంభిస్తారు. ఆచార్యులవారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి.

ఒకప్పుడు గురుకులాలుండేవి.వాటిలో చేరిని విద్యార్థులకు తల్లీ తండ్రీ అన్నీ తామే అయ్యేవారు గురువులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. తల్లీ తండ్రీ తరువాత స్థానం గురువుదే.

"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"అంటారు. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు.
"గురువునూ, గోవిందుడిని పక్కనపెట్టి ముందు ఎవరికి నకస్కారం చేస్తావంటే, గురువుకే నమస్కరిస్తాను. కారణం గోవిందుడు వున్నాడని చెప్పింది గురువేకదా" అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన భరతీయసంస్కృతి ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురుపౌర్ణమినాడు ప్రతి ఒక్కరూ గురువుల్ని సేవించాలి.

గురు సందేశము :
వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది
🌻🌻

Wednesday, November 11, 2015

अजरामरवत्प्राज्ञो विद्यामर्थ च साधयेत् ।
गृहीत इव केशेषु मृत्युना धर्ममाचरेत् ॥ 

అజరామరవత్ప్రాఙో విద్యామర్థ చ సాధయేత్
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్


ప్రాఙులు తమను తాము అజరామరులు అన్నట్లు విద్యార్జన, ధనార్జన నిరంతరం చేస్తూనే వుంటారు. అదే ధర్మాచరణ విషయానికొస్తే వెంట్రుకవాసిలో  మృత్యువు వుంటే ఎలా వుంటారో అంత జాగ్రత్తగా ధర్మాచరణ చేస్తారట.

Tuesday, November 10, 2015

पुस्तकेषु च या विद्या परहस्ते च यत् धनम। 
समये तु परिप्राप्ते न सा विद्या न तत् धनम।। 

పుస్తకేషు చ యా విద్యా పరహస్తే చ యత్ ధనం ।
సమయే తు పరిప్రాప్తే న సా విద్యా న తత్ ధనం ।।

పుస్తక పరిమితమైన జ్ఞానం, పరహస్తమైన ధనం వలన ఉపయోగం శూన్యం. ఇక్కడ సుభాషిత కారుని అభిప్రాయం పుస్తకాల నుండి పొందిన జ్ఞానాన్ని అవసరమైనప్పుడు ఆచరణలోనికి తీసుకురాకపోయినా మరియు ఇతరుల అవసరానికి ఇచ్చిన ధనం మన అవసరానికి తిరిగి ఇవ్వకపోయినా అటువంటి సంపద నిరుపయోగం.

Saturday, November 7, 2015

सत्यम ब्रूयात प्रियं ब्रूयात न ब्रूयात सत्यम अप्रियम
प्रियंच नानृतम ब्रूयात एषा धर्मः सनातनः

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం 
ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మః సనాతనః

శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణునికి సత్యాన్ని ఏ విధంగా చెప్పాలో పై శ్లోకం ద్వారా వివరించడం జరిగింది. 

సత్యాన్ని చెప్పడం మన ధర్మం, కాని అది తప్పక ఎదుటివారికి ప్రియంగా ఉండాలి. అప్రియమైన సత్యాన్ని వచించకపోవడం ఉత్తమం. మరియు ఎదుటి వారికి ప్రియమైనను అసత్యాన్ని చెప్పకూడదు. ఇదే సనాతన ధర్మంలో మోక్ష మార్గానికి దారి.